ఇది థియేటర్స్‌లో మాత్రమే చూడాల్సిన సినిమా.. ‘ఆదిపురుష్’ (Adipurush) టీజర్ ట్రోల్స్‌పై ఓం రౌత్ (Om Raut) రియాక్షన్

Updated on Oct 06, 2022 03:19 PM IST
‘ఆదిపురుష్’ (Adipurush) మొబైల్ ఫోన్లలో చూసే సినిమా కాదని చిత్రం దర్శకుడు ఓం రౌత్ (Om Raut) అన్నారు
‘ఆదిపురుష్’ (Adipurush) మొబైల్ ఫోన్లలో చూసే సినిమా కాదని చిత్రం దర్శకుడు ఓం రౌత్ (Om Raut) అన్నారు

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) నటించిన ‘ఆదిపురుష్’  (Adipurush) చిత్రం టీజర్ సంచలనం సృష్టిస్తోంది. అయోధ్య వేదికగా విడుదలైన ఈ టీజర్ విడుదలైన 24 గంటల్లోనే అన్ని భాషల్లో కలిపి 101 మిలియన్‌ వ్యూస్‌తో ఇండియా నం 1 రికార్డు సాధించింది. బాలీవుడ్‌ (Bollywood)లో ఫాస్టెస్ట్‌ 50 మిలియన్‌ వ్యూస్‌ సాధించిన టీజర్‌గా రికార్డు సృష్టించింది. కేజీఎఫ్​–2 రికార్డును ఆదిపురుష్ బ్రేక్ చేసింది.

‘ఆదిపురుష్’ టీజర్‌పై మిశ్రమ స్పందనలు వస్తున్నాయి. కొంతమంది అభిమానులు ఈ టీజర్ అద్భుతమని, విజువల్ వండర్‌ను తలపిస్తోందని అంటున్నారు. రాముడిగా ప్రభాస్ లుక్ అదిరిపోయిందంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే మరికొంత మంది మాత్రం టీజర్‌లో ప్రభాస్ లుక్స్, విజువల్ ఎఫెక్ట్స్‌ బాగా లేవని పెదవి విరుస్తున్నారు.

‘ఆదిపురుష్’ టీజర్ కార్టూన్ వీడియోలా ఉందని.. తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన ‘విక్రమ సింహా’ను ఇది గుర్తు చేస్తోందని సోషల్ మీడియాలో కామెంట్లు వస్తున్నాయి. కొందరు నెటిజన్స్ మాత్రం హాలీవుడ్ చిత్రాల బడ్జెట్‌తో పోలిస్తే ప్రభాస్ నటించిన ఆదిపురుష్ మూవీ తక్కువ నిర్మాణ వ్యయంతో, మంచి క్వాలిటీ విజువల్ ఎఫెక్ట్స్‌తో ఆకట్టుకునేలా ఉందని ప్రశంసిస్తున్నారు.

ఇక ఆదిపురుష్ టీజర్ మీద సోషల్ మీడియాలో వస్తున్న విమర్శలపై చిత్ర దర్శకుడు ఓం రౌత్ స్పందించారు. ట్రోలింగ్‌ చూసి తాను కాస్త ధైర్యం కోల్పోయిన మాట వాస్తవమేనని రౌత్ అన్నారు.  అయితే, ట్రోలింగ్‌ వల్ల తానేమీ పూర్తిగా ఆశ్చర్యపోలేదన్నారు. ‘ఆదిపురుష్’ సినిమాను వెండితెర కోసం తీశామని ఓం రౌత్ స్పష్టం చేశారు. ఈ మూవీని మొబైల్ ఫోన్లలో చూసేందుకు తీయలేదన్నారు. అందరికీ చేరువ చేయాలనే ఉద్దేశంతోనే యూట్యూబ్‌ ఆడియెన్స్‌ కోసం టీజర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చామని రౌత్ పేర్కొన్నారు.

వచ్చే జనరేషన్ కోసమే తీశాం

‘మేం కొద్ది మంది కోసమే ఆదిపురుష్ సినిమాను తీయలేదు. బిగ్ స్క్రీన్లకు దూరమైన వారి కోసం, మారుమూల ప్రాంతాల్లో ఉన్న వారినీ థియేటర్‌కు రప్పించే ప్రయత్నం చేశాం. ఎందుకంటే ఇది రామాయణ కథ. గ్లోబల్‌ కంటెంట్‌ కోరుకుంటున్న తర్వాతి జనరేషన్‌ను కూడా దృష్టిలో పెట్టుకుని ఈ సినిమాను తీస్తున్నాం. వారికి అర్ధమయ్యే విధంగా చెప్పాలని ప్రయత్నిస్తున్నాం. అందుకే మేం ఈ మార్గాన్ని (3డీ మోషన్‌ క్యాప్చర్‌)ను ఎంచుకున్నాం’ అని ఓం రౌత్‌ చెప్పుకొచ్చారు.

ఇక వీఎఫ్‌ఎక్స్‌ వర్క్‌పై వస్తున్న ట్రోల్స్‌ నేపథ్యంలో ఇప్పటివరకూ తీసిన ఫుటేజ్‌ను మరింత మెరుగు పర్చేందుకు ‘ఆదిపురుష్’ మూవీ యూనిట్ ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు సమాచారం. ప్రేక్షకులకు నచ్చే విధంగా మరిన్ని మెరుగులుదిద్దే పనుల్లో చిత్ర బృందం తలమునకలైనట్లు తెలిసింది. 

కాగా ఓం రౌత్ తెరకెక్కిస్తున్న ఆదిపురుష్​ చిత్రంలో ప్రభాస్ సరసన జానకి పాత్రలో కృతీ సనన్ నటిస్తున్నారు. రావణుడి పాత్రలో సీనియర్ హీరో సైఫ్ అలీ ఖాన్ యాక్ట్ చేస్తున్నారు. వచ్చే ఏడాది జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీని గ్రాండ్‌గా రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.  

Read more: Boy cott Adipurush : 'బాయ్ కాట్ ఆదిపురుష్' ట్రెండింగ్ వెనుక ఉన్న‌ అస‌లు కార‌ణాలు ఏంటి?

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!