టాలీవుడ్ లో మరో విషాదం.. ప్రముఖ సంగీత దర్శకుడు మణిశర్మకు (Manisharma) మాతృవియోగం..!
టాలీవుడ్ సీనియర్ హీరో రెబల్ స్టార్ కృష్ణంరాజు (Rebelstar Krishnam raju) మరణ వార్త మరువకముందే మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ సంగీత దర్శకుడు మణిశర్మకు మాతృవియోగం కలిగింది. మణిశర్మ తల్లి యనమండ్ర సరస్వతి (88) తీవ్ర అనారోగ్యంతో కన్నుమూశారు. కొన్నాళ్లుగా అస్వస్థతతో బాధపడుతున్న సరస్వతి ఆదివారం సాయంత్రం చెన్నైలో మరణించారు.
చెన్నైలోని మణిశర్మ (Manisharma) సోదరుడు రామకృష్ణ నివాసానికి సరస్వతి భౌతికకాయాన్ని తరలించారు. సోమవారం ఆమె అంత్యక్రియలను నిర్వహించనున్నారు. సరస్వతి మృతి పట్ల పలువురు టాలీవుడ్, కోలీవుడ్ సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు.
కాగా, మణిశర్మ (Manisharma) తండ్రి వైఎన్ శర్మ నాలుగేళ్ల కిందటే మరణించారు. ఇప్పుడు తల్లి కూడా మరణించడంతో మణిశర్మ శోకసంద్రంలో మునిగిపోయారు. మణిశర్మ మంచి సంగీత కళాకారుడిగా, కంపోజర్గా రాణించడం వెనుక, ఆయన తల్లి సరస్వతి ప్రోత్సాహం ఎంతో ఉంది.
మణిశర్మ (Manisharma) టాలీవుడ్లోని ప్రముఖ సంగీత దర్శకులలో ఒకరిగా కొనసాగుతున్నారు. ఆయన తనయుడు మహతి స్వరసాగర్ కూడా భీష్మ, ఛలో వంటి సినిమాలతో సంగీత దర్శకుడిగా మంచి గుర్తింపును సొంతం చేసుకున్నారు. ఇక మణిశర్మ చాలా కాలం పాటు పెద్ద చిత్రాలకు దూరంగా ఉన్నా.. ఇప్పుడే మళ్లీ పరిశ్రమలో యాక్టివ్ అవుతున్నారు. ఆయన పలు ప్రాజెక్టులకు కూడా ఇప్పుడు సంగీతం అందిస్తున్నారు.
మచిలీపట్నంలో జన్మించిన మణిశర్మ (Manisharma) ఆ తర్వాత అనేకమంది సంగీత దర్శకుల దగ్గర కంపోజర్గా పనిచేశారు. అశ్వినీదత్ నిర్మాణంలో మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) హీరోగా తెరకెక్కిన 'చూడాలని ఉంది' సినిమాతో మణిశర్మ సంగీత దర్శకుడిగా ఇండస్ట్రీలోకి రంగ ప్రవేశం చేశారు.