మహేష్‌బాబుతో (MaheshBabu) అనిల్‌ రావిపూడి మరో సినిమా?

Updated on Apr 29, 2022 07:23 PM IST
సరిలేరు నీకెవ్వరు షూటింగ్‌లో అనిల్‌తో మహేష్‌బాబు (MaheshBabu)
సరిలేరు నీకెవ్వరు షూటింగ్‌లో అనిల్‌తో మహేష్‌బాబు (MaheshBabu)

సూపర్‌‌స్టార్ మహేష్ బాబులోని హీరోయిజంతోపాటు కామెడీ టైమింగ్‌ మిక్స్‌ చేసి ‘సరిలేరు నీకెవ్వరు’ వంటి బ్లాక్‌ బస్టర్ హిట్ కొట్టిన దర్శకుడు అనిల్ రావిపూడి. ఈ సినిమా మహేష్ కెరీర్‌‌లోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. అయితే ఈ హిట్ కాంబినేషన్​లో మరో సినిమా రాబోతోందని తెలుస్తోంది. ఓ ఇంటర్వ్యూలో మహేష్‌బాబుకి చెప్పిన స్టోరీలైన్ ఆయనకి నచ్చిందని, దాని స్క్రిప్ట్​పై పనిచేస్తున్నానని అనిల్ రావిపూడి స్వయంగా  తెలపడంతో మరోసారి మహేష్ కామెడీని ఎంజాయ్ చేయొచ్చని  సూపర్‌‌స్టార్‌‌ అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు.

శ్రీమంతుడు, భరత్ అను నేను, మహర్షి వంటి మెసేజ్ ఓరియంటెడ్ సినిమాల తర్వాత సూపర్‌‌స్టార్‌‌ తీయబోయే సినిమా ఎలా ఉండబోతుందోనని అభిమానులు ఎంతగానో వెయిట్ చేశారు. వారి నిరీక్షణకు అదిరిపోయే పంచులు, డైలాగులతో ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాతో కథల ఎంపికలో తనకెవరూ సరిలేరనిపించాడు సూపర్స్టార్ మహేష్‌బాబు. ఆ సినిమాకు దర్శకత్వం వహించిన అనిల్ రావిపూడి మహేష్‌ను డిఫరెంట్‌గా చూపించి సూపర్ సక్సెస్ అందుకున్నారు. ఆ సినిమా విజయం అందుకున్నప్పటినుంచి వీళ్ల కాంబినేషన్​లో మరో సినిమా ఎప్పుడు వస్తుందని అభిమానులు అడుగుతూనే ఉన్నారు. అయితే తాజాగా అనిల్ ఇదే విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో ప్రస్తావించారు. మహేష్ సార్‌‌తో‌ మరోసారి పనిచేసేందుకు నేను సిద్ధంగా ఉన్నాను. స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. ఆయన స్క్రిప్ట్ ఓకే అంటే సినిమా పట్టాలెక్కడమే. ప్రస్తుతం ఆయన చేతిలో వరుస సినిమాలు ఉన్నాయి. నేను ఎఫ్3 సినిమా షూటింగ్ పూర్తిచేసి రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నాను. తర్వాత బాలయ్యతో సినిమా ఉంది. మా ఇద్దరి చేతిలో ఉన్న ప్రాజెక్టులు పూర్తవగానే తప్పకుండా సినిమా ప్రారంభిస్తాం అని అనిల్ చెప్పుకొచ్చారు. అంతేకాదు సినిమాలపరంగానే కాకుండా వ్యక్తిగతంగానూ మహేష్ అంటే తనకు అభిమానమనీ, వారిద్దరి మధ్య గొప్ప అనుబంధముందని సూపర్‌‌స్టార్‌‌పై తన అభిమానాన్ని చాటుకున్నారు అనిల్.

ప్రస్తుతం మహేశ్ బాబు.. పరశురామ్ దర్శకత్వంలో చేసిన సర్కారు వారి పాట సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ చిత్రం మే 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో కీర్తి సురేశ్ కథానాయిక. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పరశురామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు తమన్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. ఈ చిత్రం తర్వాత మహేశ్ (MaheshBabu).. త్రివిక్రమ్ డైరక్షన్‌లో ఓ సినిమా చేయడానికి పచ్చజెండా ఊపారు. త్వరలోనే ఈ సినిమా సెట్స్​పైకి వెళ్లనుంది.

మరోపక్క అనిల్ రావిపూడి.. తాను తెరకెక్కించిన ఎఫ్3 సినిమా పోస్ట్ ప్రొడక్షన్స్ పనుల్లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా కూడా వచ్చే నెల 27న విడుదల కానుంది. వెంకటేశ్, వరుణ్ తేజ్‌తో తీసిన ఈ చిత్రం ఎఫ్2కు సీక్వెల్‌గా రానుంది. తమన్నా, మెహరీన్ కథానాయికలు. ఇది కాకుండా నందమూరి బాలకృష్ణతో ఓ సినిమా చేయబోతున్నారు అనిల్. బాలయ్యతో చేయబోయే సినిమా తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని, ఇది విభిన్న జోనర్‌లో ఉండటమే కాకుండా.. సర్‌ప్రైజింగ్ విషయాలు ఎన్నో ఉంటాయని స్పష్టం చేశారు.

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!