సిరివెన్నెల వాక్యాలు ఇప్పటికీ నా బాధ్యతను గుర్తుచేస్తున్నాయంటున్న పవర్‌‌స్టార్ పవన్‌ కల్యాణ్ (Pawan Kalyan)

Updated on May 24, 2022 10:38 AM IST
సిరివెన్నెల సీతారామశాస్త్రికి నివాళులర్పిస్తున్న పవన్‌ కల్యాణ్‌
సిరివెన్నెల సీతారామశాస్త్రికి నివాళులర్పిస్తున్న పవన్‌ కల్యాణ్‌

‘‘కవి తన రచనల ద్వారా అమరత్వం పొందుతాడు. తను భౌతికంగా లేకపోయినా సమాజానికి అందించిన అక్షర కిరణాల ద్వారా స్ఫూర్తినిస్తాడు. పంచభూతాలలో కలసిపోయినా రాబోయే తరానికి దిశానిర్దేశం చేస్తూనే ఉంటాడు. అలాంటి గొప్ప కవి శ్రీ ‘సిరివెన్నెల’ సీతారామ శాస్ర్తి’’  అని ఆయనను గుర్తుచేసుకున్నాడు పవర్‌‌స్టార్ పవన్‌కల్యాణ్‌ (Pawan Kalyan). ఈ మేరకు ఆయన ఒక లేఖ విడుదల చేశారు. ‘‘సీతారామ శాస్ర్తి జయంతి సందర్భంగా విడుదలైన ‘సిరివెన్నెల సీతారామశాస్ర్తి సమగ్ర సాహిత్యం’ మొదటి సంపుటి చూశాక ఆ అక్షర తపస్విని మొదటిసారి ‘రుద్రవీణ’ సినిమా సమయంలో కలిసిన సందర్భం గుర్తుకు వచ్చింది. అన్నయ్య చిరంజీవి నటించిన ఈ సినిమాకు నాగబాబు అన్నయ్య నిర్మాతగా ఉన్న ఈ చిత్రానికి నేను సహ నిర్మాతగా పాలుపంచుకొన్నాను. అప్పుడు శాస్ర్తి గారితో భేటీ అయ్యేవాడిని. ఆ చిత్రంలో ‘చుట్టూపక్కల చూడరా చిన్నవాడా’ పాటలో చివరి చరణం ఇప్పటికీ నన్ను వెంటాడుతూనే ఉంటుంది. 

సిరివెన్నెల సీతారామశాస్త్రికి నివాళులర్పిస్తూ పవన్‌ కల్యాణ్‌ చేసిన ట్వీట్

‘నువ్వు తినే ప్రతి ఒక మెతుకు ఈ సంఘం పండించింది. 

గర్వించే ఈ నీ బ్రతుకు ఈ సమాజమే మలిచింది

రుణం తీర్చు తరుణం వస్తే తప్పించుకుపోతున్నావా

తెప్ప తగలబెట్టేస్తావా ఏరు దాటగానే’ 

అనే ఈ పంక్తులు ఇప్పటికీ నా బాధ్యతను గుర్తు చేస్తూ ఉంటాయి. నన్ను నిలబెట్టిన ఈ సమాజానికి రుణం తీర్చుకోవడం నా విధిగా భావిస్తాను. ‘మనకున్నది పదిమందికీ పంచాలి’ అది ప్రకృతి ధర్మం అనే విషయాన్నీ ‘రుద్రవీణ’లోని ‘తరలిరాద తనే వసంతం..’ పాటలో వినిపించారు. 

సిరివెన్నెల సీతారామశాస్త్రి

‘పంచే గుణమే పోతే – ప్రపంచమే శూన్యం

ఇది తెలియని మనుగడ కథ – దిశనెరుగని గమనము కద’ 

అనే వాక్యాలలోని భావాన్ని అందరం తెలుసుకోవాలి.  ఏరు దాటాకా అవసరం తీరిందని తెప్ప తగలబెట్టే ఆలోచనలతో బాధ్యతాయుత స్థానాల్లో ఉన్నవారు శాస్త్రిగారి సాహిత్యాన్ని చదివి అర్థం చేసుకోవాలి. ఆయన రచనలు అన్నింటిలోనూ కవిగా ఆయనలోని సామాజిక బాధ్యత కనిపిస్తుంది. సమాజానికి కూడా బాధ్యతలు గుర్తు చేసే దృక్పథం అందులో నిక్షిప్తమై ఉంటుంది. ఆయన అక్షరాలు నిత్య చైతన్య కిరణాలు. శాస్ర్తి గారి రచనలలోని గాఢతను చెబుతూ కవిగా ఆయనను మరింత అర్థం చేసుకునేలా చేశారు త్రివిక్రమ్‌. ‘సిరివెన్నెల సీతారామ శాస్ర్తి సమగ్ర సాహిత్యం అందిస్తున్న ‘తానా’ బృందానికి నా హృదయపూర్వక అభినందనలు’’ అని పవన్‌కల్యాణ్‌ (Pawankalyan ) పేర్కొన్నారు.

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!