తెలుగు ఇండియ‌న్ ఐడల్ (Telugu Indian Idol) షోలో 'మ‌ద‌ర్స్ డే' గెస్ట్ ఎవ‌రంటే?

Updated on May 11, 2022 09:35 AM IST
తెలుగు ఇండియన్ ఐడిల్ సింగింగ్ షో (Telugu Indian Idol)
తెలుగు ఇండియన్ ఐడిల్ సింగింగ్ షో (Telugu Indian Idol)

ఆహా ఓటీటీలో ప్ర‌సార‌మవుతున్న‌ తెలుగు ఇండియన్ ఐడిల్ (Telugu Indian Idol) సింగింగ్ షో విజయవంతంగా 20 ఎపిసోడ్స్ పూర్తి చేసుకుంది. అయితే, ఈ వారాంతంలో మదర్స్ డే ను పురస్కరించుకుని మెలోడీ బ్రహ్మ మణిశర్మను అతిథిగా ఆహ్వానించారు. ఈ మేర‌కు నిర్వాహకులు ఫ్యామిలీ స్పెషల్ ఎపిసోడ్ ను ప్లాన్ చేశారు. ఈ షో జడ్జీల్లో ఒకరైన నిత్యా మీనన్ తనదైన శైలిలో మణిశర్మను ఈ ప్రోగ్రామ్ కు ఆహ్వానించారు. అనంత‌రం మిగిలిన ఇద్దరు జ‌డ్జీలు ఎస్ఎస్ థ‌మన్, సింగ‌ర్ కార్తీక్.. మణిశర్మతో పాటు కలిసి ఓ పాటకు స్టెప్పులేశారు. మణిశర్మ గెస్ట్ గా స్టేజ్ మీదకు ఎంట్రీ ఇవ్వగానే పోటీదారులు సైతం ఉత్సాహంగా పాటతో ఆహ్వానించారు. గత వారం తిరుపతికి చెందిన మాన్య ఎలిమినేట్ అయింది. దీంతో ఈ వారం రెండు ఎపిసోడ్స్ లో మొత్తం తొమ్మిది మంది గాయనీ గాయకులు తమ ప్రతిభను చాటి వ్యూవర్స్ నుండి ఓట్లను కోరారు.

ఇక‌, మణిశర్మను (Mani Sharma) సంగీత ప్రియులు మెలోడీ బ్రహ్మా అంటారు. అయితే తెలుగు ఇండియన్ ఐడిల్ (Telugu Indian Idol) హోస్ట్ శ్రీరామచంద్ర మాత్రం ఆయనను తెలుగు మ్యూజిక్ ఐడిల్ అని పేర్కొన్నాడు. ఆయన‌తో పాటు ఈ కార్యక్రమంలోని కంటెస్టెంట్స్ త‌ల్లుల‌ను ప్రత్యేకంగా ఆహ్వానించారు. అయితే, కార్య‌క్ర‌మం ప్రారంభానికి ముందు మణిశర్మతో తనకున్న అనుబంధాన్ని తమన్, కార్తీక్ వివ‌రించారు. తనతో ఎక్కువ పాటలు పాడించి, న‌న్ను తెలుగువారికి ద‌గ్గ‌ర‌య్యేలా చేశారని కార్తీక్ చెప్పారు. అనంతం మణిశర్మ లేకపోతే తాను లేనని అన్నాడు థ‌మన్. మ‌ణిశ‌ర్మ‌ దగ్గర ప్రోగ్రామర్ గా పని చేసిన సమయంలో ఎన్నో విషయాలు తెలుసుకున్నానని, తాను క్రికెటర్ ను కావడం వల్లే మణిశర్మ బృందంలో చోటు పొందానని తెలిపాడు. అయితే, మణిశర్మ అప్పట్లో గల్లీ క్రికెట్ సూపర్ గా ఆడేవారని కితాబిచ్చాడు.

ఇక‌, చివ‌ర్లో జ‌డ్జీ కార్తీక్ (Singer Karthik) త‌ల్లికి సంబంధించిన వీడియో బైట్ ను ప్లే చేశారు. తన కొడుకు కార్తీక్ ఎంతో గొప్ప గాయకుడని, అయితే అతను భక్తి గీతాలు కూడా పాడితే వినాలని ఉన్న‌ట్లు ఆమె పేర్కొన్నారు. వెంటనే మ‌ణిశ‌ర్మ అందుకొని ఆ భక్తి గీతాలకు తాను సంగీతం అందిస్తానని, ‘అరుణాచల శివ’ పేరుతో ఆల్బమ్ తీసుకువద్దామని అన్నారు. అనంత‌రం థ‌మ‌న్ క‌ల‌గ‌జేసుకొని మణిసార్ ఇచ్చే ట్యూన్స్ కు తాను ప్రోగ్రామింగ్ చేస్తానని హామీ ఇచ్చాడు. ఇదే ఇండియ‌న్ ఐడ‌ల్ షో వేదికపై తొలి సీడీని విడుదల చేద్దామని, తాను అప్పుడు మరోసారి వస్తానని మణిశర్మ అన్నారు. ఆ తర్వాత కంటెస్టెంట్స్ అంతా క‌లిసి అమ్మ పాటతో మెడ్లీ చేసి శ్రోతలను ఆకట్టుకున్నారు. ఇదిలా ఉంటే.. ఈ వారం బెస్ట్ పర్ఫార్మర్ గా వైష్ణవి ఎంపికై గిఫ్ట్ హ్యాంపర్ ను అందుకుంది.

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!