టాలీవుడ్‌లో కథానాయికగా నటించాలని ఉంది : పలక్ తివారి (Palak Tiwari)

Published on May 10, 2022 03:13 PM IST

పలక్ తివారి.. ఈమె బాలీవుడ్ పరిశ్రమలో పేరొందిన నటి.  ప్రముఖ నటి శ్వేతా తివారీ కుమార్తెగా ఈమె సుపరిచితురాలు.  రాజా చౌదరి ఈమె తండ్రి. సింగపూర్ ఇంటర్నేషనల్ స్కూల్ నుండి పట్టభద్రురాలైన పలక్, ముంబైలోని మిథిబాయి కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్‌ నుండి గ్రాడ్యుయేషన్‌ను పూర్తి చేసింది. ఆ తర్వాత మోడలింగ్ ప్రపంచంలోకి అడుగుపెట్టింది.

టెలివిజన్ నటిగా సుపరిచితురాలైన పలక్ (Palak Tiwari), ఆ తర్వాత హిందీ పరిశ్రమలో కూడా తన పాగా వేసింది. నటన అనే కళలో తాను రాణించడానికి కారణం తన అమ్మ ప్రోత్సాహమే అని ఆమె అంటోంది. తన తల్లే తనకు అన్నింటిలోనూ ఆదర్శమని చెబుతోంది.  చిన్నతనం నుండి, ఆమె తన తల్లి మాదిరి నటించాలనే ఆలోచనతోనే ఈ రంగం పట్ల ఆకర్షితురాలు అయ్యిందని.. ఇదే క్రమంలో నృత్య శిక్షణను తీసుకుందని తెలిపింది పలక్.

పలక్ 2020లో విడుదలైన బాలీవుడ్ చిత్రం రోసీ: ది సాఫ్రాన్ చాప్టర్‌ ద్వారా చలనచిత్ర రంగ ప్రవేశం చేసింది. ఆ తర్వాత ఆమె బాలీవుడ్ చిత్రం "క్వికీ"లో  ప్రియా వాధ్వా అనే పాత్రను పోషించింది. అదే సంవత్సరం విడుదలైన హార్డీ సంధు సారధ్యంలోని బిజిలీ మ్యూజిక్ వీడియోలో కూడా పలక్ దుమ్ము రేపింది. ప్రస్తుతం యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో ఉన్న ఈ పాటలో పాలక్ తన హొయలతో కుర్రకారును మత్తెక్కించింది. 

ఇటీవలే హైదరాబాద్ నగరాన్ని సందర్శించిన పలక్ (Palak Tiwari).. స్థానిక విలేకరులతో ముచ్చటించింది. టాలీవుడ్ హీరోలతో తనకు నటించాలని ఉందని, దక్షిణాదిలో ఏదైనా ఒక సినిమాలో నటించాలన్నది తన డ్రీమ్ అని తన మనసులోని మాటను బయటపెట్టింది.