Ashoka Vanam Lo Arjuna Kalyanam ( అశోకవనంలో అర్జున కళ్యాణం) : నటి రితికా నాయక్ మదిలోని మాట

Published on May 10, 2022 12:44 PM IST

ప్రస్తుతం ఎక్కడ చూసినా విశ్వక్ సేన్ నటించిన " అశోక వనంలో అర్జున కళ్యాణం" (Ashoka Vanam Lo Arjuna Kalyanam) సినిమా గురించే చర్చ. ఈ సినిమాకు ముందు విడుదలైన ప్రాంక్ వీడియో, ఎంత పెద్ద వివాదానికి దారి తీసిందో మనకు తెలియంది కాదు. కేవలం సినిమాను ప్రమోట్ చేయడం కోసమే ఈ గొడవ చేశారా? అని ప్రేక్షకులు ఆశ్చర్యపోయేంతగా ఈ ఘటన ఇండస్ట్రీలో బజ్ క్రియేట్ చేసింది. ఈ విషయాలన్నీ పక్కన పెడితే, సినిమా మాత్రం ప్రస్తుతం హిట్ టాక్ సంపాదించుకుంది. ఈ సినిమాలో కథానాయికగా నటించిన రితికా నాయక్, తొలి సినిమాతోనే తన పాత్రతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.

రితికా నాయక్ స్వస్థలం ఢిల్లీ. అశోక వనంలో అర్జున కళ్యాణం (Ashoka Vanam Lo Arjuna Kalyanam) చిత్రంలో ఈమె హీరోయిన్ చెల్లెలుగా నటించినా కూడా, తర్వాత కథ మొత్తాన్ని మలుపు తిప్పే పాత్రగా ఆమె క్యారెక్టర్ నిలిచింది. అందుకే, ప్రస్తుతం ఆమె నటనపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. సినిమా ప్రారంభంలో రితిక చిన్న పాత్రతోనే పరిచయమైనా, చివరికి ఆమె కథానాయిక రుక్సార్ ధిల్లాన్‌తో పోటా పోటీగా నటించింది.

ఈ క్రమంలో ప్రేక్షకుల నుండి మంచి మార్కులే కొట్టేసింది. ఇటీవలే ఆమె మీడియాతో మాట్లాడుతూ "నా పాత్రను ఇంతలా ఆదరించిన ప్రేక్షకులకు నా ధన్యవాదాలు. ఇంత మంచి పేరు వస్తుందని ఊహించలేదు. టాలీవుడ్‌లో ఇంకా మంచి మంచి పాత్రలలో నటించాలని ఉంది" అని తన మనసులోని మాటను బయటపెట్టింది.