కళ్ల ముందు జరిగే సంఘటనల ఆధారంగా తెరకెక్కించిన సినిమా ‘జాన్‌ సే...’ : దర్శకుడు ఎస్.కిరణ్ కుమార్

కొత్త నటీనటులతో కొత్త దర్శకుడు కిరణ్‌ కుమార్ తెరకెక్కించిన సినిమా జాన్‌ సే. ఈ సినిమా పోస్ట్‌ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి

టాలీవుడ్‌లోకి ఎంతో మంది కొత్త దర్శకులు వస్తున్నారు. ఎటువంటి బ్యాక్‌గ్రౌండ్‌ లేకపోయినా సినిమా అంటే ఇష్టం, పాషన్‌తో పలువురు ఇండస్ట్రీకి వచ్చి సక్సెస్ అవుతున్నారు. అటువంటి వాళ్ల లిస్ట్‌లోకి వచ్చి చేరిన మరో దర్శకుడు ఎస్‌.కిరణ్ కుమార్. క్రితి ఎంటర్‌‌టైన్‌మెంట్ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌‌పై తెరకెక్కిస్తున్న మొదటి సినిమా ‘జాన్‌ సే’.

అంకిత్‌, తన్వి హీరోహీరోయిన్లుగా నటిస్తున్న జాన్‌సే సినిమాను లవ్‌ + థ్రిల్లింగ్ జానర్‌‌లో తెరకెక్కించారు దర్శకుడు ఎస్‌.కిరణ్‌కుమార్. కథ, స్క్రీన్‌ప్లే కూడా ఆయనే అందిస్తున్నారు. షూటింగ్ ఇప్పటికే పూర్తైన ఈ సినిమాకు సచిన్ కమల్ సంగీతాన్ని అందించారు. జాన్‌ సే సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో దర్శకుడు కిరణ్ కుమార్ మీడియాతో మాట్లాడారు. ఆ విశేషాలు పింక్‌విల్లా వ్యూయర్స్ కోసం..

సినిమా టైటిల్‌ చూస్తే లవ్‌ స్టోరీ అనిపిస్తోంది.. క్రైమ్‌ థ్రిల్లర్ అంటున్నారు?

-క్రైమ్ థ్రిల్లర్ ప్రధానంగా కథ సాగుతున్నప్పటికీ లవ్‌ స్టోరీ కూడా సినిమాలో ఉంటుంది. జాన్‌ సే అనే టైటిల్‌ ప్రేమను సూచిస్తుంది. అదే సమయంలో మరో కోణం కూడా టైటిల్‌లో అర్ధం అవుతుంది.

సక్సెస్‌ఫుల్ జాబ్, బిజినెస్‌లో ఉన్న మీకు సినిమాలోకి రావాలన్న ఆలోచన ఎలా మొదలైంది?

నేను అనుకునే కథను, ఆలోచనలను సినిమా రూపంలో చెప్పాలనే ఆసక్తి నన్ను దర్శకుడిని చేసింది. జాన్ సే సినిమా కథను సినిమాగా తెరకెక్కించాలని 9 సంవత్సరాలుగా అనుకుంటున్నాను. ఆరు నెలల క్రితమే స్క్రిప్ట్‌ రెడీ చేసుకున్నాను.

మొదటి సినిమాకే క్రైమ్, లవ్‌స్టోరీ కథను సెలెక్ట్ చేసుకున్నారు. ముందుముందు మీ నుంచి ఎటువంటి సినిమాలు ఆశించవచ్చు?

అన్ని జానర్లలో సినిమాలు తెరకెక్కించాలని అనుకుంటున్నాను. అన్ని రకాల ప్రేక్షకులను అలరించాలనేది నా కోరిక.

ఇండస్ట్రీతో ఎటువంటి సంబంధం లేకపోయినా.. ఏ నమ్మకంతో సినిమా తీశారు?

కథే నన్ను నడిపించింది. మొదట్లో సినిమా తెరకెక్కించడం ఏం ఉందిలే అనుకున్నాను. అయితే పోను పోను అర్థమవుతోంది. సినిమా అనేది మహాసముద్రం అని. కొత్త కొత్త విషయాలు తెలుసుకుంటూనే షూటింగ్ పూర్తి చేశాను. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. లైఫ్‌లో రిస్క్ తీసుకోకుంటే అడుగుముందుకు పడదని నమ్ముతాను. ఆ నమ్మకంతోనే సినిమా ఇండస్ట్రీలోకి వచ్చాను.

కొత్త దర్శకుడిగా  మీరు ఎదుర్కొన్న ఇబ్బందులు ఏంటి?

-కొత్తగా ఏ వృత్తిలోకి అడుగుపెట్టినా ఇబ్బందులు ఉంటాయి. అలాగే ఇక్కడ కూడా ఉన్నాయి. సినిమా తీస్తున్నప్పుడు సమస్యలు ఎదుర్కొన్నాను. సినిమాను సరిగ్గా తీయగలనా లేదా అని చాలా మంది సందేహించారు. నా మీద నమ్మకం ఉన్న వాళ్లు సినిమా చేయడానికి ముందుకు వచ్చారు. వాళ్లతోనే సినిమా తీశాను.

జాన్ సే సినిమా గురించి చెప్పండి? ఏ తరహా ప్రేక్షకులకు మీ సినిమా ఎక్కువగా నచ్చుతుందని అనుకుంటున్నారు?  

-ప్రతి రోజూ మన కళ్ల ముందు జరిగే సంఘటనలకు దగ్గరగా ఈ సినిమాను తెరకెక్కించాం. ఝాన్సీ లక్ష్మీబాయి వంటి తెగువ, మోక్షగుండం విశ్వేశ్వరయ్య వంటి తెలివి కలిగిన అమ్మాయి ఈ సమాజంలో ఎలా బతుకుతుంది అనేది జాన్‌ సే సినిమా కథలోని ప్రధాన అంశం.  

జాన్ సే టైటిల్ చివర మూడు చుక్కలు ఉన్నాయి. వాటికి ఏమైనా ప్రత్యేకత ఉందా?

మూడు చుక్కలు ముగ్గురు వ్యక్తుల జీవితాలకు సంబంధించిన కథకు సంబంధించినవి. వాటిలో రెండు క్యారెక్టర్ల గురించి త్వరలో పరిచయం చేస్తాను. మూడో పాత్ర గురించి సినిమాలో చూసి తెలుసుకోవాల్సిందే.  

ఏ దర్శకుడి సినిమాలను ఎక్కువగా ఇష్టపడతారు?

దాదాపుగా అందరి సినిమాలు చూస్తాను. అయితే పూరి జగన్నాథ్‌ గారి సినిమాలంటే ఇష్టం. నాకంటూ ఒక ప్రత్యేకత ఉండాలని అనుకుంటాను. మా టీం అందరూ చాలా బాగా సహకరించారు. అందుకే కేవలం 22 రోజుల్లోనే షూటింగ్ పూర్తి చేయగలిగాను.

ఓటీటీలకు క్రేజ్‌ పెరిగిన సమయంలో ప్రేక్షకుడు థియేటర్‌‌కు వచ్చి మీ సినిమా ఎందుకు చూడాలి? ప్రత్యేకత ఏంటి ?

-జాన్‌ సే సినిమాకి ప్రధాన బలం కథ. ప్రేక్షకులను థియేటర్‌‌కి తీసుకువచ్చేలా ప్రమోషన్స్‌ నిర్వహించేలా ప్లాన్ చేశాం. సినిమాలో మొత్తం మూడు పాటలు ఉన్నాయి. కథలో భాగంగా రెండు పాటలు ఒక థీమ్ సాంగ్ ఉంటుంది. సచిన్ కమల్ మంచి సంగీతం అందించారు. థియేటర్‌‌లో సినిమాను ప్రేక్షకులు తప్పకుండా ఎంజాయ్ చేస్తారు. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్ వర్క్‌ జరుగుతోంది. అన్నీ అనుకున్నట్టు జరిగితే రెండు నెలల్లో సినిమాను విడుదల చేస్తాం. సినిమాకు సంబంధించిన బిజినెస్ గురించి ఇప్పటివరకు ఎవరితోనూ మాట్లాడలేదు. ఇక నుంచి ఆ పనులు మొదలుపెట్టాలి. 

సినిమాలో అందరూ కొత్త వాళ్లే ఉన్నారా? సీనియర్ యాక్టర్లు కూడా నటించారా ?

 కొత్త ఆర్టిస్టులతోపాటు తనికెళ్లభరణి, సూర్య, అజయ్, బెనర్జీ, ఐ డ్రీమ్ అంజలి వంటి సీనియర్ యాక్టర్లు కూడా జాన్‌ సే సినిమాలో నటించారు. కెమెరామెన్ మోహన్‌ బాగా సపోర్ట్ చేశారు. ప్రొడ్యూసర్ రఘు సహకారం మరువలేనిది. 

మీ భవిష్యత్తు ప్రాజెక్టుల గురించి ఏమైనా చెప్తారా ?

నేను ఎక్కువగా డబ్బులు ఆశించడం లేదు. ఈ సినిమాకు ఖర్చు పెట్టిన డబ్బులు వచ్చేస్తే చాలు, మరో సినిమాను మొదలుపెడతాను. సాధ్యమైనంత ఎక్కువ మందికి సినిమాను దగ్గర చేయాలనేది నా ప్రయత్నం.   

Read More : టాలీవుడ్ (Tollywood) ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న టాప్‌10 క్రేజీ కాంబినేషన్స్

You May Also Like These