జపాన్‌లో రిలీజ్‌కు రెడీ అవుతున్న ఆర్ఆర్ఆర్ (RRR Movie).. ప్రమోషన్స్‌కు వెళ్లనున్న జక్కన్న అండ్ కో?

ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్ కోసం రాజమౌళి అండ్ టీమ్ జపాన్ వెళ్తారని వార్తలు వస్తున్నాయి

టాలీవుడ్ దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి (SS Rajamouli) తెరకెక్కించిన దృశ్యకావ్యం ‘ఆర్ఆర్ఆర్’. ఈ చిత్రం విడుదలై దాదాపుగా ఆరు నెలలైంది. అయినా ఈ సినిమా గురించి ఏదో ఒక న్యూస్ వైరల్ అవుతూనే ఉంది. ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డుకు ఈ మూవీ నామినేట్ అవుతుందని అందరూ భావించారు. కానీ మన దేశం తరఫున అధికారిక చిత్రంగా నామినేట్ కాలేదు. అయినప్పటికీ జక్కన్న అండ్ టీమ్ నమ్మకాన్ని కోల్పోలేదు. అమెరికాలోని పలు థియేటర్లలో ప్రదర్శితమైన నేపథ్యంలో నామినేషన్‌పై ఆశల్ని వదులుకోలేదు. 

ఆస్కార్ అవార్డుల విషయాన్ని పక్కనబెడితే.. జపాన్‌లో గ్రాండ్ రిలీజ్‌కు ఆర్ఆర్ఆర్ సిద్ధమవుతోంది. అక్టోబర్ 21న ఈ సినిమా అక్కడ విడుదల కాబోతోంది. ప్రమోషన్లను కూడా భారీ ఎత్తున నిర్వహించేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. జపాన్ వెళ్లేందుకు చిత్ర దర్శకుడు రాజమౌళితోపాటు కథానాయకులు జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR), రామ్ చరణ్ తేజ్ (Ram Charan) సిద్ధమైనట్లు సమాచారం. జపాన్ రాజధాని టోక్యోలోని షింజుకు సిటీలో ఈనెల 21న జరిగే ఆర్ఆర్ఆర్ స్క్రీనింగ్‌కు తారక్, చరణ్, జక్కన్నలు హాజరు కాబోతున్నారని వినికిడి. అయితే, ఈ న్యూస్‌పై ఇప్పటిదాకా ఆర్ఆర్ఆర్ టీమ్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. 

ఇక రాజమౌళి తీసిన ఆర్ఆర్ఆర్‌పై హాలీవుడ్‌లో కూడా ప్రశంసల వర్షం కురుస్తోంది. ఈ చిత్రం ఓ అద్భుతమంటూ అక్కడి సినీ ప్రముఖులు మెచ్చుకుంటున్నారు. ఈ సినిమాకు తప్పకుండా ఆస్కారు అవార్డులు ఇవ్వాలంటూ ఎంతోమంది సోషల్ మీడియాలో డిమాండ్ చేస్తున్నారు. అంతేకాదు సోష‌ల్ మీడియాలో #RRRForOscars అనే హ్యాష్ ట్యాగ్‌నూ ట్రెండ్ చేస్తున్నారు. 

టాలీవుడ్ న‌టులు రామ్ చ‌ర‌ణ్, ఎన్టీఆర్‌తోపాటు బాలీవుడ్ యాక్టర్స్ అజ‌య్ దేవ‌గ‌ణ్, అలియా భ‌ట్ కూడా ఆర్ఆర్ఆర్‌లో కీల‌క పాత్ర‌లు పోషించారు. ఈ సినిమా ప్ర‌పంచ వ్యాప్తంగా దాదాపుగా రూ. 1200 కోట్ల‌ను వ‌సూలు చేసింది. తద్వారా భారతీయ సినీ చరిత్రలో అత్య‌ధిక వ‌సూళ్లు రాబ‌ట్టిన చిత్రాల్లో ఒకటిగా నిలిచి రికార్డు సృష్టించింది. 

Read More: 'ఆర్ఆర్ఆర్' (RRR) సినిమాకు ఆస్కార్ ఇవ్వాలంటూ సోష‌ల్ మీడియాలో పోస్టులు

You May Also Like These