Nivetha Thomas Birthday Special : తెలుగు వారి మదిని దోచిన మలయాళ కుట్టి !

నిన్ను కోరి, బ్రోచేవారెవరురా లాంటి సినిమాలతో ఇక్కడి కుర్రకారు గుండెల్లో కూడా పాగా వేసిన కేరళ కుట్టి నివేదా థామస్ (Nivetha Thomas).

కళ్లతోనే అన్ని భావాలు పలికించే యువ నటి నివేదా థామస్ ( Nivetha Thomas). మలయాళ అమ్మాయి అయినా, తెలుగు ప్రేక్షకులకు కూడా తన నటనతో బాగా దగ్గరైన కథానాయిక. నిన్ను కోరి, బ్రోచేవారెవరురా లాంటి సినిమాలతో ఇక్కడి కుర్రకారు గుండెల్లో కూడా పాగా వేసిన కేరళ కుట్టి నివేదా థామస్. 

బాలనటిగా కెరీర్ ప్రారంభించిన నివేద.. ఇప్పుడు మలయాళ సినిమాలతో పాటు దక్షిణాది భాషలలో కూడా అనేక సినిమాలు చేస్తూ కెరీర్‌లో దూసుకుపోతున్నారు.  అందం, అభినయంతో పాటు.. చలాకీతనం, కాస్త డేరింగ్ యాటిట్యూడ్ అనేవి నివేదా నటనకు ప్లస్ పాయింట్స్. ఈ రోజు నివేదా థామస్ పుట్టినరోజు సందర్భంగా పింక్ విల్లా స్పెషల్ స్టోరి

బాల్యం
నివేదా థామస్ తమిళనాడు రాష్ట్రంలో 1995 నవంబర్ 2 తేదీన జన్మించారు. ఈమె తల్లిదండ్రులు మలయాళీ కుటుంబానికి చెందిన వారు. నివేదా చదువు దాదాపు చెన్నెలోనే సాగింది. ఎస్.ఆర్.ఎమ్ యూనివర్సిటీలో ఈమె డిగ్రీ పూర్తి చేశారు. నివేదా తమిళం, మలయాళం, తెలుగు, ఇంగ్లీష్, ఫ్రెంచ్, హిందీ భాషలలో చిన్నప్పుడే మంచి పట్టు సంపాదించడం విశేషం. 

నటన వైపు అడుగులు
నివేదా థామస్ బాల నటిగా మలయాళ సినిమాల్లో నటించారు. ఆ తరువాత పలు సీరియల్స్‌లో యాక్ట్ చేశారు. 'వెరుథె ఒరు భార్య'  నివేదా థామస్ మొదటిసారి సినిమా. ఈ సినిమాలో నివేదా నటనకు మంచి గుర్తింపు దక్కింది. అంతేకాదు కేరళ రాష్ట్ర ప్రభుత్వం అందించే 'ఉత్తమ యువ నటి పురస్కారం' కూడా అందుకున్నారు నివేదా థామస్.

సన్ టీవీలో ప్రసారమయ్యే బాలల సీరియల్ 'మై డియర్ భూతం'లో కూడా నివేదా నటించారు. ఆ తరువాత నివేదా చాలా తమిళ, మలయాళ చిత్రాల్లో సహాయ నటిగా రాణించారు. చాప్పా కురిష్, తట్టతిన్ మరయతు వంటి విజయవంతమైన చిత్రాలలో నివేదా నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. 

సముద్ర ఖని దర్శకత్వంలో 2011లో విడుదలైన 'పొరాలీ' అనే సినిమాలో నివేదా కీలక పాత్రలో నటించి జనాలను మెప్పించారు. మలయాళ సినిమాలు తట్టతిన్ మరయాతు, రోమన్స్, మనీరత్నం చిత్రాలలో కూడా ఈమె నటనకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. నవీన సరస్వతి సబతమ్, జిల్లా, పాపనాసం వంటి తమిళ చిత్రాలలో నివేదా నటన ఆమె ఫ్యాన్ బేస్‌ను మరింత పెంచింది. 

టాలీవుడ్ (Tollywood) ​ఎంట్రీ
2016లో హీరో నాని నటించిన 'జెంటిల్ మేన్' చిత్రం ద్వారా తెలుగు సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టారు నివేదా థామస్. ఈ సినిమాకు గాను నివేదా తన కెరీర్‌లోనే తొలి ఫిలిమ్ ఫేర్ అవార్డును అందుకున్నారు. అదే సంవత్సరం నానితో కలిసి నటించిన 'నిన్ను కోరి' సినిమా నివేదాకు మంచి పేరు తీసుకొచ్చింది.  

జూనియర్ ఎన్టీఆర్‌తో కలిసి 'జై లవకుశ' సినిమాలో కూడా నివేదా నటించారు. ఆ తర్వాత నవీన్ చంద్రతో చేసిన 'జూలియట్ లవర్ ఆఫ్ ఇడియట్', కల్యాణ్ రామ్‌తో చేసిన '118', శ్రీవిష్ణు హీరోగా నటించిన 'బ్రోచేవారెవరురా' సినిమాలు నివేదా స్థానాన్ని టాలీవుడ్‌లో సుస్థిరం చేశాయి. 

రజనీ, పవన్ సినిమాల్లో నివేదా
2020లో విడుదైన తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమా 'దర్బార్'లో నివేదా ( Nivetha Thomas) నటించారు. ఈ సినిమాలో రజనీకాంత్ కూతురుగా నివేదా వెండితెరపై కనిపించారు. 2021లో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన 'వకీల్ సాబ్' సినిమాలో కూడా ఓ కీలక పాత్రలో నటించి మెప్పించారు.

తాజాగా రిలీజ్ అయిన 'శాకిని డాకిని' సినిమాతో నివేదా ఓ సరికొత్త పాత్రలో నటించి ప్రేక్షకులకు వినోదం అందించారు. రెజీనా కాసెండ్రాతో కలిసి ఈ సినిమాలో సందడి చేశారు. 'మిడ్ నైట్ రన్నర్స్' అనే కొరియన్ మూవీని తెలుగులో 'శాకిని డాకిని'గా రీమేక్ చేశారు. ఈ సినిమాకు మంచి గుర్తింపు లభించింది. అవకాశం వస్తే  బాలీవుడ్‌ (Bollywood) లోకి  అడుగుపెట్టేందుకు రెడీగా ఉన్నారట.

Read More: Aishwarya Rai Bachchan Birthday Special - కళ్ళతో ఆకట్టుకునే నటన ప్రపంచ సుందరి సొంతం

నివేదా థామస్ తన సహజ నటనా పటిమతో, మరిన్ని విభిన్నమైన పాత్రలతో ప్రేక్షకులను మెప్పించాలని కోరుకుంటూ.. హ్యాపీ బర్త్ డే నివేదా థామస్. 
పింక్ విల్లా
Credits: Wikipedia
You May Also Like These